
*తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
*మహిళలే స్వయంగా వంటలు చేసి విందు ఏర్పాటు
*శ్రీరామ నామంతో ఉప్పొంగిన భక్తి ఉత్సాహం
చెన్నై న్యూస్:శ్రీరామ నవమి సందర్భంగా చెన్నై కొడుంగయ్యూర్ సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం నిర్వహించారు. ముందుగా సీతారాముని చిత్రపటాలతో మేళతాళాల నడుమ సెందిల్ నగర్, వెంకటేశ్వర నగర్, ఎవరెడ్డి కాలనీ, సీతారామ నగర్ ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించి అసోసియేషన్ భవనానికి చేరుకున్నారు.
అనంతరం సీతారామ కళ్యాణ మహోత్సవంలో కొలకలేటి శ్రీనివాసకుమార్–లత, ఏ. దుర్గాప్రసాద్–రోజా, పోతురాజు వెంకటేశ్వరరావు–సత్యవాణి, పోతురాజు శ్రీను–నాగమణి దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. వేద పండితులు సంప్రదాయ పద్ధతిలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలుగు మహిళలు తెలుగుదనం ఉట్టిపడేలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఉత్సవాన్ని ఆంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు వడపప్పు, బెల్లం పానకం, మజ్జిగ, శీతల పానీయాలు పంపిణీ చేశారు. అలాగే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు స్వయంగా వంటలు చేసి భక్తులకు విందు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను అధ్యక్షుడు కె. శ్రీనివాసకుమార్, కార్యదర్శి పాతూరి లక్ష్మణరావు, ట్రెజరర్ డి. పిచ్చేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఏ. దుర్గాప్రసాద్, సి.ఎస్. జయకుమార్, సంయుక్త కార్యదర్శులు బి. శ్రీధర్, పి. బాలాజీ, గౌరవాధ్యక్షుడు ఎన్.డి. చంద్రశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు బి.వి. సుబ్బరాజు, డి. సాంబశివరావు, డి. నరసింహారాజు, డి.వి. సూర్యనారాయణ, టి. నాగరాజు, డి. వినోద్ కుమార్, పి. వెంకట వంశీకృష్ణ, డి. సీతారామానుజం తదితరులు సమన్వయం చేశారు.
మాజీ సంఘ కార్యదర్శులు ఎర్ర బనేని పట్టాభి, వంజరపు శివయ్యతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.