
విళ్లివాకం న్యూస్: తెలుగు సినిమా రచనలో సరికొత్త ఒరవడిని ప్రవేశపెట్టి, తదనంతర కాలంలోని కవులకు మార్గదర్శకుడైన విశిష్ట రచయిత పింగళి నాగేంద్రరావు అని ప్రముఖ రచయిత, గాయకులు డా. వివి రామారావు కొనియాడారు. వేద విజ్ఞాన వేదిక చెన్నై ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో భాగంగా 169వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం సాయంత్రం టీ.నగర్ ఆంధ్రా క్లబ్ లోని కృష్ణా హాల్ లో జరిగింది. ‘పింగళి సినీ సాహిత్య సౌరభం’ అనే అంశంపై డాక్టర్ వివి రామారావు ప్రసంగించారు. ఆంధ్ర కవిత్వంలో నన్నయ, తిక్కన, ఎర్రనలతో తెలుగు సినీ కవిత్రయంలో సముద్రాల, మల్లాది, పింగళిలను పోల్చవచ్చన్నారు. తెలుగు పాట ఎలా రాయాలో, ఎలా రాయకూడదో తెలిసిన విజ్ఞుడు పింగళి. ‘పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ’ వంటి చిత్రాల ద్వారా ఆయన కథా కల్పనలో, సంభాషణలలో, గీత సృజనలో నవ్యతను సాధించారు. ఆయన సృస్టించిన వింతైన పేర్లు (అరమతి కాలమతి, త్రిశోకానందుడు), మాటలు (సాహసం సేయరా డింభక, అస్మదీయులు – తస్మదీయులు, హైహై నాయక) నేటికీ సజీవంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పింగళి రాసిన మధుర గీతాలను గుర్తు చేశారు. ‘కలవరమాయె మదిలో’ లాహిరి లాహిరి లాహిరిలో’ ‘మనసు పరిమళించెలే’ వంటి పాటలను ఆలపించి సభాసదులను అలరించారు. ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన వేదిక సంస్థ కార్యదర్శి కందనూరు మధు వక్తను సభకు పరిచయం చేశారు. అనంతరం అధ్యక్షుడు జేకె రెడ్డి తదితరులతో కలిసి వక్తను జ్ఞాపికతో సత్కరించారు.