
చెన్నై న్యూస్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా చెన్నై సమీపంలోని పుళల్ కావంగరై తెలుగు ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో ఉగాది వేడుకలు గురువారం ఉదయం ఎంతో సాంప్రదాయబద్ధంగా, తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించారు.
ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించి, వేద పండితుల ప్రత్యేక అభిషేక ఆరాధనలు చేపట్టారు. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని ఆలయానికి విచ్చేసి, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు దంపతులు సమేతంగా పూజల్లో పాల్గొనడం విశేషం. అనంతరం వేద పండితులు దంపతులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
ప్రజలందరికీ షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసి పంచారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలు, భోజన వసతి ఏర్పాటు చేశారు.
ఈ ఏర్పాట్లను సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి. నరసింహారావు, కార్యదర్శి ఎం. చిట్టిబాబు, ట్రెజరర్ కె. వెంకట రమణయ్య, గౌరవాధ్యక్షుడు లయన్ జి. మురళి, చీఫ్ కోఆర్డినేటర్ జి.వి. రామకృష్ణ, ఉపాధ్యక్షులు బి. కృష్ణయ్య, ఐ. వెంకటేశ్వర్లు, పి. గోపాలకృష్ణ, జాయింట్ కార్యదర్శులు లయన్ బి. బాలాజీ, వి. బాబుజి, బి. నాగరాజు, సలహాదారులు జి. వెంకయ్య, బి. గురువారెడ్డి, బి. దామోదర్ చెట్టి, ఎం. వాసు, బి. నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.