
చెన్నై న్యూస్ : తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అధికారికంగా అనుమతి ఇవ్వడంతో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
విజయ్కు ఇప్పటికే సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీల మద్దతు లభించింది. ఎడమపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకేకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ దక్కింది.
అసెంబ్లీలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ 5 మంది సభ్యుల మద్దతు ప్రకటించింది. అదనంగా సీపీఎం-2, సీపీఐ-2, వీసీకే-2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)-2 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. దీంతో విజయ్కు మద్దతుగా మొత్తం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు గవర్నర్కు సమాచారం అందించారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు.