
సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరమో బాపట్ల జిల్లాలో జరిగిన తాజా ఘటన స్పష్టంగా చూపిస్తోంది. అందమైన ఫోటోలు, మధురమైన మాటలతో మోసం చేసి ఒక విశ్రాంత ఉపాధ్యాయుడి నుండి కోటి రూపాయలకుపైగా నగదు కాజేసిన ఘటన కలకలం రేపుతోంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లు ఇటీవలే ఉపాధ్యాయ వృత్తి నుంచి విరమణ చేశారు. ప్రస్తుతం మార్టూరు మండలం కోలలపూడిలో నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో ‘కందుకూరి మౌనిక’ పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను అంగీకరించిన ఆయన, ఆమెతో చాటింగ్ ప్రారంభించారు. తాను యుకేలో ఉంటున్నానని చెప్పిన ఆ యువతి, త్వరలో భారత్కు వస్తానని నమ్మించింది.
మొదట స్నేహంగా మాట్లాడిన ఆమె, తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. తన బంధువు ద్వారా అంతర్జాతీయ ట్రేడింగ్ ప్లాట్ఫాంలో పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసింది. ఆమె పంపిన లింకులు నమ్మిన వెంకటేశ్వర్లు విడతల వారీగా సుమారు రూ.1.10 కోట్లు బదిలీ చేశారు.
లాభాలు తీసుకోవాలనుకున్న సమయంలో మరిన్ని డబ్బులు అడగడంతో మోసం బయటపడింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అధిక లాభాల ఆశ చూపే పెట్టుబడులను నమ్మవద్దని సూచిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, యాప్లను ఉపయోగించవద్దని, మోసపోతే వెంటనే 1930కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.