
చెన్నై న్యూస్: తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ సర్వేలు డీఎంకే కూటమి మెజారిటీ సాధించేందుకు అవసరమైన 118 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఈ అంచనాల ప్రకారం, ఎఐఏడీఎంకే కూటమి రెండో స్థానంలో, టీవీకే మూడో స్థానంలో నిలిచే అవకాశముంది.
‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రకారం డీఎంకే 125 నుంచి 145 స్థానాల్లో గెలవవచ్చని అంచనా. ఎఐఏడీఎంకే కూటమి 65 నుంచి 80 స్థానాలు, టీవీకే 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 స్థానాలు సాధించే అవకాశం ఉందని తెలిపింది.
‘చాణక్య స్ట్రాటజీస్’ సర్వేలో డీఎంకేకు మరింత బలమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ సర్వే ప్రకారం డీఎంకే 145 నుంచి 160 స్థానాలు, ఎఐఏడీఎంకే కూటమి 50 నుంచి 65 స్థానాలు, టీవీకే 13 నుంచి 18 స్థానాలు, ఇతరులు 5 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశముందని అంచనా వేసింది.
‘మాత్రైజ్’ సర్వే ప్రకారం డీఎంకే 122 నుంచి 132 స్థానాలు, ఎఐఏడీఎంకే కూటమి 87 నుంచి 100 స్థానాలు, టీవీకే 10 నుంచి 12 స్థానాలు, ఇతరులు 0 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది.
తమిళనాడు శాసనసభ ఎన్నికలతో పాటు కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఎన్నికలు జరిగాయి. అసోం, కేరళ మరియు పుదుచ్చేరి ఎన్నికలు ఏప్రిల్ 9న పూర్తయ్యాయి. తమిళనాడు ఎన్నికలు గత నెల 23న ఒకే దశలో ముగిశాయి.
పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రెండో దశ ఈరోజుతో ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తికావడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
తమిళనాడులో ఈసారి 85.1 శాతం ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.
………