
న్యూ ఢిల్లీ, జూలై 05 : జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాల్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ Ê ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలసి 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ Ê ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విరాజిల్లడానికి, పరుగెత్తే కాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతి దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలో కానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమన్నారు. జర్నలిస్టులకు సంక్షేమం రక్షణ కల్పించడంలో పాత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని తెలియచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు డాక్టర్ బండి సురేంద్ర బాబు కృతజ్ఞతలు తెలియజేసారు.