
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక సలకట్ల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ఈ మహోత్సవాలకు నాంది పలుకుతూ ఈ రోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం యాగశాలలో శాస్త్రోక్తంగా జరిగే ఈ కార్యక్రమంలో నవధాన్యాలను నాటి, ప్రపంచం సస్యశ్యామలం కావాలని దేవుని ప్రార్థిస్తారు. అంకురార్పణతో ఉత్సవాల ప్రారంభానికి బీజం వేయబడినట్లుగా భావిస్తారు.
ఇదే సమయంలో శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనులవారిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లే సేనాధిపతి ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించే సంకేతంగా ఈ ఉత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
అంకురార్పణకు ముందు భూదేవిని ప్రసన్నం చేసుకునే మేదినిపూజ నిర్వహించి, అనంతరం మట్టికుండల్లో నవగ్రహాలకు సంకేతమైన ధాన్యాలను నాటి ఓషధీ సూక్తాలతో పూజలు చేస్తారు. ఈ మొలకలు తొమ్మిది రోజుల పాటు పెంచి, చివరిరోజు స్వామివారికి అక్షతారోపణగా సమర్పిస్తారు.
భక్తుల నమ్మకం ప్రకారం మొలకలు బాగా చిగురిస్తే ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని విశ్వసిస్తారు.
గమనిక: పై సమాచారం మత విశ్వాసాల ఆధారంగా అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.