
చెన్నై న్యూస్ :తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టంగా, అధికార పార్టీ DMK 2026 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి M. K. Stalin ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ హామీలను ప్రకటించారు.
మహిళలకు అందిస్తున్న నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.1000 నుంచి రూ.2000కు పెంచనున్నట్లు ప్రకటించగా, వృద్ధాప్య పెన్షన్ను రూ.1200 నుంచి రూ.2000కు పెంచనున్నారు. దివ్యాంగులకు ఇచ్చే సాయాన్ని రూ.1500 నుంచి రూ.2500కు పెంచుతామని తెలిపారు. అదనంగా, ‘ఇల్లతరసి’ పథకం కింద మహిళలకు రూ.8000 విలువైన గృహ అవసరాల కూపన్లు అందించనున్నారు.
విద్యా రంగంలో అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించడంతో పాటు, 35 లక్షల మంది కాలేజ్ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆరోగ్య భద్రతలో భాగంగా, సంవత్సరానికి రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలకు రూ.10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించనున్నారు.
రైతులకు మద్దతుగా 20 లక్షల మందికి పైగా ఉచిత ఆధునిక విద్యుత్ పంపుసెట్లు అందించనున్నారు. అలాగే వరి కనీస మద్దతు ధరను రూ.3500కు, చెరకు ధరను రూ.4500కు పెంచుతామని హామీ ఇచ్చారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా 10 లక్షల కొత్త ఇళ్లు, 10 వేల కొత్త బస్సులు ఏర్పాటు చేయడం, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీల నిర్మాణం చేపట్టనున్నారు.
ఉద్యోగ అవకాశాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ, 2030 నాటికి 2 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.