
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. వైఎస్ చిత్రపటానికి టీ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంట్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, కేవీపీ, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్సార్ పాలన అని, వైఎస్ ముద్ర పేదల గుండెల్లో బలంగా ఉందని, ఆరు గ్యారంటీలకు వైఎస్ఆర్ స్ఫూర్తి అని అన్నారు.
దేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని వైఎస్ అనేవారని, కాలం కాటువేసిందో, దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ ప్రధాని కాకముందే వైఎస్ చనిపోయారని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రకు స్ఫూర్తి వైఎస్ చేసిన పాదయాత్ర అని, రాహుల్ పాదయాత్ర కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమని అన్నారు. రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారని, ప్రధాని పదవికి రాహుల్ ఒక్క అడుగు దూరంలోనే అన్నారని, రాహుల్ ప్రధాని కావడం నేటి చారిత్రక అవసరమన్నారు.
కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని, ఆయనను ప్రధాని చేయడానికి కృషి చేసేవారే వైఎస్ వారసులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు వైఎస్ వారసులు కాదన్నారు. మూడేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు 35 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామన్నారు. ఒక్కరు కూడా పైరవీకారులు లేరని, ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు..