
చెన్నై న్యూస్ : తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక తమిళుల సమస్యను లేవనెత్తుతూ, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ను ప్రశంసించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన ప్రభాకరన్పై ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
నాగపట్నంలో జరిగిన ఎన్నికల సభలో విజయ్ మాట్లాడుతూ, “ప్రభాకరన్ సమాజానికి తల్లి లాంటి వారు. శ్రీలంక తమిళులు ఎక్కడ ఉన్నా వారు మాతృ ప్రేమ చూపిన నాయకుడిని కోల్పోయి బాధపడుతున్నారు. వారి కోసం మాట్లాడటం మన కర్తవ్యం” అని అన్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2008లో కూడా శ్రీలంక తమిళులపై జరిగిన అఘాయిత్యాలకు నిరసనగా విజయ్ చెన్నైలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
1990లో భారత్ ఎల్టీటీఈను నిషేధించింది. రెండు దశాబ్దాలపాటు జాఫ్నా ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఈ సంస్థ 2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో అంతమైంది. రాజీవ్ గాంధీపై ప్రతీకారంతో 1991లో ప్రభాకరన్ ఆదేశాలపై ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన హతమయ్యారు.