
స్టే రద్దుచేసి కాకినాడ కార్పోరేషన్ లో విలీనం చేయాలి : వలసపాకల పౌర తీర్మానం
కాకినాడ, జూలై 11 : కాకినాడ అర్బన్ పరిధిలో వున్నప్పటికీ కార్పోరేషన్ పౌర సౌకర్యాలు అందని ద్రాక్షగా వలసపాకల ప్రగతి నిర్వీర్యం కాబడిందని స్థానిక పౌర సంఘం సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సాయంత్రం పంచాయతీ ఆవరణలో జరిగిన పౌర సమావేశంలో కాకినాడ పరిసర 8అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమితిగా ఏర్పడి ప్రభుత్వం వద్దకు దశల వారీగా ప్రజల భాగస్వామ్య ప్రణాళికతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళాలని నిర్ణయించాయి. స్టే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 13 ఏళ్ళుగా వలసపాకల అభివృద్ధికి నోచని దిష్టి బొమ్మలా మారిందని నిరసన వ్యక్తం చేశారు. తీరంలో భారీ పరిశ్రమల ద్వారా పుష్కలంగా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం పౌరసౌకర్యాల పెంపుదలకు అవసరమైన విలీనం చేయడం పట్ల శ్రద్ధ చూపడంలేదన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 8అర్బన్ గ్రామాల విలీన సాధనకు కమిటీ ఏర్పాటు చేపట్టి పోస్టు కార్డు ఉద్యమం స్థానిక వెతల విజ్ఞాపన అమరావతికి సైకిల్ యాత్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి పిటిషన్ తీసుకువెళ్ళడం ద్వారా కాలయాపన లేకుండా సకాలంలో సముచిత పరిష్కారం సాధించే అంశాలను చర్చించారు. గ్రామాల విలీనానికి రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వర రావు (నానాజీ) సార్వత్రిక ఎన్నికల ముందు చేపట్టిన గ్రామాల విలీన సాధనకు సంపూర్ణ మద్దతు పలికారని ఈమేరకు పంతం తోడ్పాటుతో ప్రభుత్వ నేతలను కలుస్తామని ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. మేడిశెట్టి వేంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపిపి గుబ్బల వేంకటేశ్వర రావు, ఉప సర్పంచ్ సలాది శ్రీనివాసబాబు, మాజీ ఎంపిటిసి సూరంపూడి వేంకట రమణ, డిసిసి ప్రెసిడెంట్ గింజాల సూరిబాబు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు, చింతపల్లి అజయ్ కుమార్, జోగా అప్పారావు, సూరంపూడి వేంకట రమణ, కొప్పి శెట్టి ప్రసాద్, ఈగల వీరబాబు, కిరణ్ కుమార్, ఈగల వీరబాబు, దుర్గా ప్రసాద్, ఎన్.ఎస్.ఎన్.మూర్తి, పి.వి.వి.సత్యనారాయణ, వేంకటేశ్వరరావు, ప్రకాష్, నాగబాబు, జాను, రామకృష్ణ, అప్పారావు, ప్రకాష్, పంచాయతీ మాజీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.