
ఘనంగా ఏఐటీఎఫ్ ఉగాది వేడుకలు
విళ్లివాకం న్యూస్ : తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి పిలుపు నిచ్చారు. తిరువళ్లూర్ జిల్లా, అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐటిఎఫ్ యువజన విభాగం అధ్యక్షుడు ఆర్ దామోదరన్, ఉపాధ్యక్షుడు ఎన్ నిర్మల్ చంద్ నేతృత్వంలో అంబత్తూర్ ఎంటీహెచ్ రోడ్డులో గల
హెచ్పీఎం ప్యారడైస్ కల్యాణ మండపంలో జరిగిన ఉగాది వేడుకలకు ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాయకర్ ఆర్ నందగోపాల్ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, ఆయన నిర్ణయాలు ప్రతిష్టాత్మకం అన్నారు. ఆయన ఆశయాలు అందరికీ చేరాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విధానం విద్యార్థులకు ఎంతో మంచిదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని ఆలోచించకపోవడం శోచనీయం అన్నారు. ఇందులో ఏఐటీఎఫ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీఎం కిషోర్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. నాగభూషణం, మహేష్ కుమార్, రంగనాయకులు, కేవీ జనార్దన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో వెన్నిల, లక్ష్మి నృత్య ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో పేదలకు 5 కిలోల బియ్యం, దుస్తులు వితరణగా ఇచ్చారు. ఇందులో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.
……..