
విల్లివాకం: మొగప్పేర్ తెలుగు కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్ 12వ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం చెన్నై అన్నానగర్ వెస్ట్ ఎక్స్ టెన్షన్, డీఏవీ బాలికల హయ్యర్ పాఠశాల సమీపానగల చిన్నస్వామి మ్యారేజ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా అఖిల భారత తెలుగు ఫెడరేషన్, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి విచ్చేసారు.
భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జె.విజయలక్ష్మి, అల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ చెన్నై విభాగ జనరల్ సెక్రటరీ ఆర్. నందగోపాల్, మద్రాసు హైకోర్టు న్యాయవాది దీపన్ రాజ్ కృష్ణ, మొగప్పేర్ తెలుగు కల్చరల్ అండ్ సోషల్ ఆసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ గిరి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి వి.వీరభద్రరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ నిర్మల్ చందర్, కమిటీ మెంబెర్స్ ఇక్కుర్తి సురేష్ బాబు, గిరి, ఎంఎస్ నాయుడు, డిల్లీ బాబు, రామజయం, ముఖ్య అతిథులు అడ్వకేట్ రవీంద్రనాథ్, జేయం నాయుడు పాల్గొన్నారు. గిరి హనుమంతరావు అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. వివిబి రావు స్వాగతోపన్యాసం చేశారు. హనుమంతరావు అధ్యక్షోపన్యాసం చేశారు. అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారిలో ఐక్యత కొరవడిందని, అందరూ సంఘటితంగా కలిసి రావాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పుతో మైనారిటీ భాషలు సిలబస్ లోకి వచ్చాయని, విద్యార్థులు మాతృభాషలో చదువుకునేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపాలన్నారు. సంభాషణ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలన్నారు.
ఇందులో రాజ్ కృష్ణ, జె. విజయలక్ష్మి, నందగోపాల్, రవీంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు. ఇందులో చెస్ ప్రజ్ఞానంద, కుశాల్, దియాన్ తదితర విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో అరుల్ రిథమ్స్ లైట్ మ్యూజిక్ సంగీత విభావరి, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. చివరిగా వైస్ ప్రెసిడెంట్ టిఎంకె కుమార్ వందన సమర్పణ చేశారు.
………