
వేలూరు న్యూస్ :పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. ఇక్కడ వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటే ఇహ పర సుఖాలకు లోటుండదని.. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన వారికి ముక్తి లభిస్తుందని హిందువుల నమ్మకం.
ఒక వ్యక్తి జీవితంలో ఆరుణాచలం సందర్శించాక ఒక లెక్క.. సందర్శించక ముందు మరో లెక్క అంటూ పండితులు చెప్తుంటారు. అటువంటి ముక్తి క్షేత్రానికి మొదటిసారి వెళ్తున్న వాళ్లు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
మొదటిసారి ఆరుణాచలం వెళ్లిన వారు వెంటనే ప్రధాన ఆలయంలో దర్శనానికి వెళ్లకూడదు. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతే వెళ్లాలి. అలాగే గిరి ప్రదక్షిణ అనేది కచ్చితంగా గుడికి ఎడమవైపు నుంచి మాత్రమే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కుడివైపు నుంచి చేయకూడదు. ఎందుకంటే కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారట. అందుకే కుడివైపు నుంచి ప్రదక్షిణ చేయకూడదు. ఇక గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెడతారో.. అక్కడే ముగించాలి. అప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టినా అక్కడ కచ్చితంగా ఒక వినాకుడి గుడి ఉంటుంది. కాబట్టి ముందుగా ఆ వినాయకుడికి మొక్కి వీలేతే ఒక కొబ్బరికాయ కొట్టి అప్పుడు ప్రదక్షిణ మొదలు పెట్టండి.
తిరువణ్ణామలై వెల్లే ప్రతి ఒక్కరు కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ పది రూపాయల నోట్లు, చిన్న చిన్న డబ్బాలు తీసుకువెళ్లండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేస్తే.. అక్కడ విబూది ప్యాకెట్ లు కచ్చితంగా ఇస్తారు. అలాగే గిరి ప్రదక్షిణకు వెళ్లే సయంలో చిన్న చిన్న డబ్బాలు తీసుకుని వెళితే ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ డబ్బాలలో తీసుకొని రావచ్చు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని మధ్యలో గాని ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. ఎందుకంటే 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఖాళీ కడుపుతో గిరి ప్రదక్షిణ చేస్తే చాలా ప్రశాంతంగా వేగవంతంగా పూర్తి అవుతుంది. గుంపులుగా మాట్లాడుకుంటూ గిరి ప్రదక్షిణ చేయకండి. ఏకాంతంగా చేయడమే ఉత్తమం. అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో ఎక్కువ సార్లు కూర్చోవడం చేయకండి. దీని వల్ల నరాలు పట్టి నడకలో వేగం తగ్గిపోతుంది. అంతగా అలిసిపోయినట్టు అనిపిస్తే రోడ్డు పక్కన ఉన్న బెంచీల మీద పడుకోండి.
అగ్ని లింగానికి, రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . ఈ ఆలయంలో స్వామి వారి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా చెప్తుంటారు. ఆ దక్షిణామూర్తిని అరుణాచల శివుడి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా ఒక్క దీపం అయినా వెలిగించండి. అక్కడే శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . మీరిచ్చిన దండలను అక్కడి పురోహితులు స్వామి వారి మెడలో వేస్తారట.
ఇక ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రధాన ఆలయంలో స్వామి వారి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కచ్చితంగా ఆ సుబ్రమణ్యుడి దర్శనం చేసుకోవాలట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే పెద్ద పెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం కనిపిస్తుంది. ఆ మండపంలోంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ పాతాళ లింగం ఉంటుందట. అక్కడ రమణ మహర్షి తపస్సు చేశారట. అలాగే ఉత్తరం వైపున ఉన్న అమ్మాని అమ్మన్ అనే మహా భక్తురాలు కట్టించిన ప్రధాన గోపురం కింద నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం చెబుతుందట. ఇక రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది. అక్కడ కాల బైరవుడినితప్పకుండా దర్శనం చేసుకోవాలట.
అరుణాచలేశ్వరుని దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్ లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయలు ఇస్తే.. గోత్ర నామాలు చదివి కొబ్బరికాయలు కొట్టి.. విభూతి ప్రసాదంగా ఇస్తారు. కొబ్బరికాయలు లేకపోతే గోత్రనామాలు చదవరట. ఇక ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతిని ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అద్బుతంగా ఉంటుందని చెప్తారు. ఇక మొదటిసారి అరుణాచలం వెళ్తున్న వారు ఈ వివరాలు మాత్రమే కాకుండా మీకు తెలిసి వాళ్లలో ఎవరైనా అరుణాచలం వెళ్లి వచ్చినవారి అనుభవాలు తెలుసుకుని వెళ్లండి. మీ అరుణగిరి యాత్రను సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోండి.
…………………