
నాగలాపురం న్యూస్: నాగలాపురం టి.ఆర్.ఆర్ కళ్యాణ మండపంలో 2004–2006 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత అధ్యక్షత వహిస్తూ, ఇలాంటి విస్తృత కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన పూర్వ విద్యార్థుల గురుభక్తి, వినయ విధేయతలకు ఎంతో మద్దతు అందించారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు, అండదండలు ఎంత అవసరమో సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని వారు వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగలాపురం జూనియర్ కళాశాల పూర్వ అధ్యక్షుడు టి.రామచంద్రన్ ఉపన్యాసిస్తూ, విద్యార్థుల అంకితభావానికి సంతోషించి, వారి మార్గదర్శకత్వంలో జీవిస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జీవితం అంటే బ్రతకడం కాదు, నిజమైన జీవనమనేది అని, విద్యార్థులు ఆదర్శప్రాయంగా ఉన్నారని పేర్కొన్నారు. అపూర్వ విద్యార్థుల జీవన సరళికి ఉపయుక్తమైన పలు అంశాలను ప్రస్తావిస్తూ, విద్యార్థులు నైతికతతో, ఆదర్శప్రాయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజ పురోగతికి తోడ్పడే కార్యక్రమాలను చేపట్టాలని కోరుకున్నారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న బోటనీ లెక్చరర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గురువు ఎక్కడ ఉన్నా గౌరవింపబడుతాడు. అందుకే మంచి శిష్యులు ఉండటం ఎంతో ముఖ్యం; ఇలాగే మా విద్యార్థులే లక్ష్యప్రాయమని చెప్పారు. తమ శిష్యులు ఉన్నత స్థాయిలో ఉన్నందుకు గర్వపడుతున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న సివిక్స్ లెక్చరర్ పి. వడివేల్ విద్యార్థుల ఆత్మీయతకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా, తమ శిష్యులు ఉన్నత పదవులను అలంకరించి, కళాశాల మాత్రమే కాకుండా రాష్ట్రం, దేశం గర్వించేలా జీవించాలని మార్గదర్శకం సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తాము పూర్వజన్మ సుకృతం అన్న భావనను కలిగించిందని తెలిపారు. రెండు దశాబ్దాల తరువాత కూడా విద్యార్థులు తమ గురుభక్తిని మరువరాదు.
గౌరవ అతిథిగా వృత్తి విద్యా అధ్యాపకుడు జి. దేవేంద్ర విద్యార్థుల ఆప్యాయతకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగు అధ్యాపకుడు డాక్టర్ ఎం. మునిరత్నం కూడా విద్యార్థులందరినీ పేరుపేరునా పలకరించారు. “ఈ కళాశాల నా జీవితంలో మరువలేని గుర్తుగా నిలిచింది. రెండు దశాబ్దాల తరువాత కూడా నా శిష్యబృందాన్ని మరచిపోకుండా, ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థులందరికి అభినందనలు” అని అభిప్రాయపడ్డారు.
తదుపరి, ఉపాధ్యాయ పదవికి అందించే గౌరవం, తల్లిదండ్రులు పిల్లల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం, బిడ్డలకు నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత, ఆధ్యాత్మిక చింతన కలిగించాల్సిన అవసరం గురించి విశదీకరించారు. ఈ కళాశాలతో తనకున్న అవినాభావ సంబంధాన్ని సభాముఖంగా పంచుకున్నారు.
విద్యార్థుల పలకరింపులు, వారి ఆత్మీయతలు, అనురాగాలు ఆయన జీవితంలో మరువలేనివని, ఉపాధ్యాయ బృందాన్ని కొనియాడుతూ, కళాశాల ప్రిన్సిపాల్ గారి అభివృద్ధి కార్యక్రమాలు రాబోవు తరాలకు ఆదర్శమని తెలిపారు.
గౌరవ అతిథిగా మ్యాథ్స్ అధ్యాపకురాలు రేఖా ప్రదీప్ రెడ్డి, ఎకనామిక్స్ అధ్యాపకురాలు సి. సుజాతా మరియు ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ప్రతాప్ , విద్యార్థుల ప్రేమ, అనురాగాలు తమ జీవితంలో మధుర జ్ఞాపకాలు అవుతాయని, విద్యార్థుల ఉన్నతికి ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని కలిగి, పూర్వ విద్యార్థుల బృందం, గురువులకున్న భక్తిని గజపుష్పమాలు, సాలువులు, జ్ఞాపికలు ద్వారా సత్కరించి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు, రథసారథులుగా ఉండి నడిపించిన మణికంఠ, నరేష్, బాలాజీ సుబ్రహ్మణ్యం, దిలీప్, గురుమూర్తి తదితరులు, వారి సహకారానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
కొంత మంది ఉపాధ్యాయులు అనివార్య కారణాల వలన కార్యక్రమంలో పాల్గొనలేకపోయినా, తమ ఆశీర్వచనాలు విద్యార్థులందరికీ ఉంటాయని సందేశం పంపారు.
కార్యక్రమం తెలుగుతల్లి ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై, సాంస్కృతిక కార్యక్రమంతో అలరించి, వందన సమర్పణ, ఉప్పొంగి, జాతీయ గీతంతో ముగిసింది.
……………