
ప్రభుత్వం ఉత్తర్వులు..వెంటనే బాధ్యతలు స్వీకరణ
సిఎం రేవంత్తో మర్యాదపూర్వక భేటీ
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. నూతన డీజీపీగా నియమితులైన జితేందర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత దిల్లీ సీబీఐలో.., 2004`06 వరకు గ్రేహౌండ్స్లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో తెలంగాణ డీజీపీగా 14 నెలలపాటు కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. మరోవైపు ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖలో ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం అందిస్తున్న స్కేలు ప్రకారమే ఆయనకు వేతనం అందించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని జితేందర్ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీకి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.