
కాకినాడ, జూలై 5 : గత వైసిపి ప్రభుత్వం నిర్వాకం వల్ల వైద్యరంగం పూర్తిగా కుదేలైందని, దీన్ని అధిగమించి పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ఆయన అమరావతిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కాకినాaడ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు, మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. అలాగే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు జిల్లా పర్యటనకు విచ్చేయాలని మంత్రిని ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన కాకినాడ జిల్లాలో వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.