
విళ్లివాకం న్యూస్: చెన్నై పెరంబూరు, పటేల్ రోడ్డులో గల ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు రోజుల కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజుగా ఉదయం 6:00 గంటలకు గణపతి హోమంతో ప్రారంభించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించబడ్డాయి. సాయంత్రం 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు గాయని యడవల్లి అరుణ శ్రీనాథ్ నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది.
ఇందులో హిందోళ రాగంలో ‘నిగమ నిగమ’ (అన్నమాచార్య కీర్తన), ‘చరణములే నమ్మితి’, ‘పలుకే బంగారమాయన’, ‘పిబరే రామరసం’, ‘కురై ఒండ్రుం ఇలై’ తదితర కీర్తనలు శ్రావ్యంగా ఆలపించారు. అలాగే, గాయకులు ఎం.ఆర్ సుబ్రహ్మణ్యం కొన్ని భక్తి గీతాలను ఆలపించారు. కీబోర్డు ఎన్ వి బాబు, తబలా రమేష్ సహకారం అందించారు. ఇందులో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, సహాయ కార్యదర్శి పి రవికుమార్, కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు, గుడిమెట్ల చెన్నయ్య, విజయలక్ష్మి, శ్రీనాథ్ సహా పుర ప్రముఖులు పాల్గొన్నారు. చివరిగా అరుణ శ్రీనాథ్, ఎంఆర్ సుబ్రహ్మణ్యంలను నిర్వాహకులు సత్కరించారు.