
చెన్నై న్యూస్ :దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన నీట్ (యూజీ) పరీక్ష అవకతవకల అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్షల రద్దులు, పునఃపరీక్షల నిర్వహణ వంటి పరిణామాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష అనంతరం చోటుచేసుకున్న వివాదాల కారణంగా నిరాశ, ఆందోళనలకు లోనవుతున్నారని తెలిపారు.
దేశంలోని అనేక కుటుంబాలు తమ పిల్లల విద్య కోసం శిక్షణా కేంద్రాలు, ప్రయాణం, వసతి తదితర ఖర్చుల కోసం భారీ మొత్తాలను వెచ్చించాయని, ఇప్పుడు మళ్లీ అదే పరీక్షా ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం విద్యార్థులకు అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించే ముందు పరీక్షా విధానాన్ని పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ విద్యా సంవత్సరంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఈ ఏడాదికి మాత్రమే అయినా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర మార్కుల ఆధారంగా వైద్య విద్య ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు.
………..