
చెన్నై న్యూస్ :మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి బారామతి ప్రాంతంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. ఈ ఘటన బారామతి నియోజకవర్గ పరిధిలోని గోజుబావి ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
విమానం భూమిపైకి దిగిన వెంటనే ఇంజిన్ భాగం నుంచి పొగలు ఎగసిపడటంతో అక్కడ క్షణాల పాటు ఆందోళన నెలకొంది. విమానంలో ఉన్న కొంతమంది స్వల్ప గాయాలకు గురైనట్లు సమాచారం. అయితే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఎలాంటి గాయాలు కాలేదా అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బారామతిలో పర్యటన నిమిత్తం అజిత్ పవార్ అక్కడికి చేరుకున్నారని, ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని వర్గాలు చెబుతున్నాయి. బారామతి పవార్ కుటుంబానికి రాజకీయంగా కీలకమైన ప్రాంతం కావడం గమనార్హం.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు మరియు పోలీస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత స్పష్టత రానుంది. తాజా సమాచారం కోసం అప్డేట్స్ను గమనించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు