
విల్లివాకం న్యూస్: వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత’ ఉపన్యాస ధారావాహిక 168వ సదస్సు ఆదివారం సాయంత్రం టి.నగర్, విజయ రాఘవ రోడ్డులో గల ఆంధ్రా క్లబ్, కృష్ణా హాలు వేదికగా జరిగింది. ఇందులో ‘విజయనగర వికటకవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం’ అనే అంశంపై డాలస్, టెక్సస్ నివాసి, తెలుగు భాషాభిమాని, ముఖ్య అతిథిగా డా. నరసింహారెడ్డి ఊరిమిండి విచ్చేసి సమగ్రమైన ప్రసంగం చేశారు. తెనాలి రామకృష్ణ కవి జీవిత విశేషాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, విజయనగర సామ్రాజ్య కాలంలో కవి ప్రతిభ ఎలా వికసించిందో శ్రోతలకు స్పష్టంగా వివరించారు. వికటకవి అన్న బిరుదు కేవలం హాస్యానికి మాత్రమే పరిమితం కాదని, ఆ హాస్యానికి వెనుక ఉన్న లోతైన బుద్ధి, తర్కశక్తి, సామాజిక స్పృహే తెనాలి కవిని అమరుడిగా నిలిపిందని పేర్కొన్నారు. చాటు పద్యాల ద్వారా కవి చూపిన కవితా వైభవం, చమత్కార సంభాషణా శైలి, రాజసభలో సమస్యా పూరణల ద్వారా ప్రదర్శించిన అపూర్వ ప్రతిభను ఉదాహరణలతో వివరించారు.
డా. నరసింహారెడ్డి ప్రసంగంలో తెనాలి రామకృష్ణకవి హాస్య చతురత, సరస వర్ణన, వ్యంగ్య ధోరణి మాత్రమే కాకుండా, నైతికత, ధర్మబోధ, మానవ సంబంధాల పట్ల కవి చూపిన సూక్ష్మ దృష్టిని కూడా స్పృశించారు. తెనాలి కవి హాస్యం వినోదానికే కాకుండా, ఆలోచనకు, సంస్కరణకు దారితీసేదిగా ఉండేదని స్పష్టంగా చెప్పారు.
ప్రత్యేకంగా ‘పాండురంగ విభుని పదగుంఫనం’ అనే తెనాలి రామకృష్ణుని కృతిని విశ్లేషిస్తూ, అందులోని పదప్రయోగాల వైశిష్ట్యం, వస్తు సాక్షాత్కారం, లోకోక్తులతో కూడిన పద్య నిర్మాణం, నిగూఢమైన భావప్రకటనలను సోదాహరణంగా వివరించారు. వికటాక్షర బంధం, వక్రోక్తి, చమత్కారోక్తి వంటి అలంకారాల సమన్వయం తెనాలి కవిత్వానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చిందని తెలిపారు. సరళమైన పదాలలో లోతైన భావాన్ని ప్రతిపాదించడమే తెనాలి రామకృష్ణకవి కవిత్వానికి ప్రాణమని అన్నారు.
మొత్తంగా ఈ ఉపన్యాసం ద్వారా తెనాలి రామకృష్ణకవి కేవలం వికటకవిగా మాత్రమే కాకుండా, సాహిత్య గంభీరత, భాషా చాతుర్యం, సామాజిక స్పృహ కలిగిన మహాకవిగా శ్రోతల ముందుకు ఆవిష్కృతమయ్యారని సదస్సులో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. తెలుగు సాహిత్య సంప్రదాయంలో తెనాలి రామకృష్ణకవి స్థానం ఎంత విశిష్టమైనదో ఈ ప్రసంగం స్పష్టంగా చాటిచెప్పిందని నిర్వాహకులు ప్రశంసించారు.
తెనాలి రామకృష్ణకవి రచనల ప్రస్తావనలో భాగంగా, ఘటికాచల మహత్యం, ఉద్భటారాధ్య చరిత్ర, పాండురంగ మహత్యం వంటి ప్రసిద్ధ గ్రంథాలలోని కొన్ని విశిష్ట సంఘటనలను డా. నరసింహారెడ్డి ఊరిమిండి విశదీకరించారు. అదే విధంగా ప్రస్తుతం అలభ్యంగా భావించబడుతున్న కందర్పకేతు విలాసం, హరిలీలా విలాసం వంటి రచనల ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తూ, ఆ గ్రంథాలలో కనిపించే కథన వైశిష్ట్యం, భావసంపన్నత, శిల్ప నైపుణ్యం తెనాలి రామకృష్ణకవిని సమగ్ర సాహిత్య ప్రతిభావంతుడిగా నిలిపాయని కొనియాడారు. సంస్థ కార్యదర్శి కందనూరు మధు స్వాగతోపన్యాసం చేశారు. అధ్యక్షులు జెకె రెడ్డి వక్తను సత్కరించారు. ఇందులో ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, ఆనంద్ కుమార్, డాక్టర్ ఏవి శివకుమారితోపాటు పలువురు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
===========