
చెన్నై, న్యూస్:జనసేన పార్టీ తమిళనాడులో రాజకీయ అడుగులు వేస్తుందా? తమిళనాడు ప్రజల అభీష్టాన్ని బట్టి జనసేన తన పరిధిని విస్తరించవచ్చని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళిక రచించలేదని, కానీ ప్రజల ఆకాంక్షల మేరకు మార్పులు సంభవించవచ్చని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను మంచి నాయకుడిగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్, ఆయనలో పగ తీర్చుకోవాలనే భావం లేకపోవడం ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యంగా, స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటికీ, తల్లి జయలలిత ప్రవేశపెట్టిన ‘అమ్మ క్యాంటీన్’లను మూసేయకుండా కొనసాగించడం ఆయన ఉదారతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తమిళనాడులో జనసేన రాజకీయ ప్రయాణం?
ఓ ప్రముఖ తమిళ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలపై స్పందించారు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన గురించి మాట్లాడిన ఆయన, ముందస్తు ప్రచారం వల్ల విభజనకు దారితీసే అవకాశముందన్నారు. ఎన్డీఏ కూటమిలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని, దక్షిణాది ప్రాంతాలకు సీట్లు తగ్గిపోవద్దని తాను కోరుకుంటానని తెలిపారు.
“భారతదేశం ఐక్యంగా ఉండాలంటే ప్రాంతాల మధ్య సమన్వయం అవసరం. హిందీ భాషను బలవంతంగా రుద్దడం సరైంది కాదు. ఉత్తరాదివారు దక్షిణాది భాషలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపించాలి. అలాగే, దక్షిణాది ప్రజలు హిందీ నేర్చుకోవాలని బలవంతపెట్టడం కూడా కరెక్ట్ కాదు” అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఎంజీఆర్, ఎన్టీఆర్ మార్గంలో జనసేన
తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతూ, తాను అన్నాదురై, ఎంజీఆర్లను ఆదర్శంగా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి విజయవంతం కావడం అంత తేలికకాదని, ఇది కేవలం ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ఎన్టీఆర్ 9 నెలల్లోనే అధికారం చేపట్టడం అరుదైన రాజకీయ ఘట్టమని, అలాంటి అవకాశాలు అందరికీ రాకపోవచ్చని అన్నారు.
తమిళనాడులో రాజకీయాలు ఎంతో సంక్లిష్టమని, ఇక్కడ పొత్తులు కుదిరితే ఓట్ల షేరింగ్ ఎలా జరుగుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు. “ఏఐఏడీఎంకే-టీవీకే పార్టీలు కలిసి పనిచేయగలవా? కార్యకర్తల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా? అన్నది అనుమానమే. అయితే, తెలుగుదేశం-జనసేన కేడర్ మధ్య సహజంగా కలిసిపోయే సమన్వయం ఉంది” అని పేర్కొన్నారు.
ఎఐఏడీఎంకే-ఎన్డీఏ పొత్తుపై పవన్ కళ్యాణ్ స్పందన
తమిళనాడులో ఎన్డీఏ కూటమిలో ఏఐఏడీఎంకే చేరితే ఆనందంగా ఉంటుందని, ఎంజీఆర్ స్థాపించిన ఆ పార్టీ బలంగా నిలబడాలని తాను కోరుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బలమైన నాయకుడని, గతంలోనూ ఆ పార్టీ ఎన్డీఏలో భాగంగా పని చేసిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఏఐఏడీఎంకే-జనసేన పొత్తు అవకాశాలను కొట్టిపారేయలేమని సూచించారు.
“ప్రజల అభీష్టాన్ని బట్టి జనసేన తమిళనాడులో అడుగుపెడుతుంది. మేము ఎక్కడా తొందరపడం. ప్రజాస్వామ్యంలో ప్రతి నిర్ణయం ప్రజా ఆకాంక్షలకే అనుగుణంగా ఉండాలి” అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు.
…..