
ఢిల్లీ ప్రతినిధి:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలోని పరిస్థితులు, రాజకీయ అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక విషయాలను హోంమంత్రికి వివరించారు. పవన్ తీసుకెళ్లిన అంశాలపై అమిత్ షాను సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో డిప్యూటీ సీఎంగా అమిత్ షాతో ఫస్ట్ మీటింగ్ సక్సెస్ అయిందని జనసేన నాయకులు అంటున్నారు. అమిత్ షాతో సమావేశం ముగియడంతో ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్ కి పయనమైతున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకుంటారని రాష్ట్ర జనసేన నేతలు చెబుతున్నారు.
కాగా రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, బాలికపై అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నాయి. దీంతో శాంతి భద్రతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను డిప్యూటీ సీఎంగా ఉన్నానని, కానీ హోంమంత్రి పదవి తీసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు వేరేలా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు హోంమంత్రి వంగలపూడి అనితపోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ పవన్ వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత, పలువురు కూటమి నాయకులు మద్దతు ఇచ్చారు. శాంతి భద్రతల విషయంలో మరింత దూకుడు పెంచుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. ఏపీలోని శాంతి భద్రతలపైనే ప్రధానంగా అమిత్ షాతో చర్చించేందుకు పవన్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఢిల్లీ టూర్ ముగిసేవరకూ ఉత్కంఠ నెలకొంది. అమిత్ షాతో జరిపిన చర్చలు సక్సెస్ అయినట్లు జనసేన నేతలు చెబుతున్నారు