
విల్లివాకం న్యూస్: గుండెకు రక్తప్రసరణ ఆగితే దానిని హార్ట్ అటాక్ అంటాము. అదే మెదడుకి జరిగితే దానిని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దీనికి అత్యవసర చికిత్స అవసరం. ఏమాత్రం ఆలస్యమైనా మెదడుకు శాశ్వత నష్టం కలిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో తగిన సమయంలో సరిఅయిన చికిత్స ఇవ్వడం వలన స్ట్రోక్ వల్ల మరణాలు తగ్గడం సంతోషించతగ్గ విషయం.
వ్యాధిలక్షణాలు : సరిగ్గా మాట్లాడలేక పోవడం, తిమ్మిర్లు, ఒక చెయ్యి కాలు బలహీనత, మూతి వంకర, దృష్టి లోపం, తలనొప్పి, వాంతులు, స్మృహ కోల్పోవడం మొదలైనవి. వీటిల్లో ఏది గమనించినా తక్షణం వైద్యున్ని సంప్రదించాలి.
కారణాలు : స్ట్రోక్ కు రెండు కారణాలు. మెదడుకు రక్తం సరఫరా చేసే
నాళం పూడిపోవడం(త్రోమ్బోటిక్ స్ట్రోక్ – Thrombotic Stroke). రెండవది రక్తనాళం ఉబ్బి పగిలి మెదడులో రక్తస్రావం కావడం. ఇది కోలుకోవడం కష్టతరం. ఇంకొకరకం మెదడుకి రక్తప్రసరణ తాత్కాలికంగా (ఒకటి రెండు నిమిషాలు) ఆగిపోవడం. దీనిని ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ ఎటాక్ (TIA) అంటారు. అప్పుడు మెదడుకు నష్టం కలుగకపోయినా ఎప్పుడైనా తీవ్రమైన స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కోవిడ్ వ్యాధిసోకినవారికి రక్తం గడ్డకట్టే స్వభావంవలన మొదటిరకం స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ.
రెండవరకం హెమరాజ్ స్ట్రోక్ (Hemorrhagic Stroke) అంటారు. అధిక రక్తపోటు, రక్తనాళాల బలహీనత, రక్త గడ్డకట్టకుండా చేసే మందుల మోతాదు ఎక్కువ కావడం, తలకు బలమైన గాయం కావడం మొదలైనవి. ప్రారంభదశలో అన్నీ ఒకేరకంగా ఉంటాయి గాబట్టి ఆలస్యం గాకుండా వైద్యుని సంప్రదించడం అవసరం.
స్ట్రోక్ వచ్చే అవకారం ఎవరికీ ఎక్కువ :
జీవనశైలి కారణాలు: ఊబకాయం, వ్యాయామలేమి, మానసిక ఒత్తిళ్లు, ధూమపానం, అధికత్రాగుడు, మత్తుపదార్థాలు వాడటం
ఆరోగ్యపరమైన కారణాలు: రక్తపోటు, మధుమేహం, రక్తంలో అధిక క్రొవ్వు నిద్రలో శ్వాస పరమైన ఇబ్బందులున్నవారు, హృదయ కవాటాల వ్యాధులు, క్రమస్పందన లోపాలు కుటుంబనియంత్రణ మందులు, ఈస్ట్రోజెన్ ఉన్న మందులు వాడటం 60 ఏళ్ళ పైబడిన వయస్సు పురుషుల్లో కొంచం అధికం. అయితే స్త్రీలలో స్ట్రోక్ వస్తే కోలుకోవడం కష్టం, ప్రాణాపాయం అధికం.
స్ట్రోక్ వల్ల ఉత్తరోత్తర ఇబ్బందులు:
ఇవి మెదడుకు ఎంతమేరకు నష్టం జరిగింది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కాలు చెయ్యి బలహీనత, ఆహారం మ్రింగుడు పడకపోవడం. మాటలు సరిలేక పోవడం, ఎడమప్రక్క మెదడు దెబ్బతింటే (కుడిచేయి వాటముండేవారికి) మాటలు పడిపొయ్యే అవకారం ఎక్కువ. జ్ఞాపకశక్తి లోపించడం మొదలైనవి. త్రోంబోటిక్ స్ట్రోక్ తక్షణమే గుర్తించి గడ్డకట్టిన రక్తం కరిగించే ప్రక్రియ (thrombolytic therapy) ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీనివలన మెదడుకి కలిగే నష్టం చాలావరకు తగ్గించవచ్చు. రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
నివారణ మార్గాలు:
పైన సూచించిన జీవనశైలి మార్పులు చాలాఅవసరం. రక్తపీడనం మధుమేహ నియంత్రణ, రక్తంలో క్రొవ్వుతగ్గించే మందులు, అధికంగా గడ్డకట్టకుండా చేసే మందులు వైద్యుల సలహామేరకు వాడడం. మానసిక ప్రశాంతత, క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం. వాటిల్లో ఉన్న లోపాలకు తగిన చర్యలు తీసుకోవడం లాంటివి.
ఆచార్య సీఎంకే రెడ్డి, అధ్యక్షులు,
తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్.
……………