Logo
Date of Publish : 10 July 2024, 9:23 am
Editor : CH. MUKUNDARAO

టీమిండియా కోచ్‌ అధికారిక ప్రకటన ఆలస్యమయ్యేనా?

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగిసింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్‌ పదవి కాలం ముగియగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విజ్ఞప్తితో టీ20 ప్రపంచకప్‌ వరకు కొనసాగాడు. ఇక త్వరలోనే కొత్త హెడ్‌ కోచ్‌ను బీసీసీఐ నియమించనుంది. జులై చివరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్‌ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టీమిండియా కోచ్‌ కోసం ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రాసెస్‌ పూర్తయింది. ఇంటర్వ్యూ కోసం భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌తో పాటుగా భారత మహిళా జట్టు కోచ్‌గా పనిచేసిన డబ్ల్యూవీ రామన్‌ కూడా హాజరయ్యారు. అయితే బీసీసీఐ గంభీర్‌ వైపే మొగ్గుచూపిందని తెలుస్తోంది. త్వరలోనే గంభీర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమిస్తారని సోషల్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం జీతభత్యాల విషయంలో బీసీసీఐ, గంభీర్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది.జులై 27 నుంచి శ్రీలంక, భారత్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ లోపు కొత్త హెడ్‌ కోచ్‌ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సహాయక కోచ్‌ల ఎంపిక విషయంలో కూడా గౌతమ్‌ గంభీర్‌కు బీసీసీఐ పూర్తిస్వేచ్ఛ ఇచ్చిందని సమాచారం. గౌతీ మార్గనిర్ధేశంలో కేకేఆర్‌ టీమ్‌ ఐపీఎల్‌ 2024 టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఆటగాడిగా 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ గంభీర్‌గెలిచిన విషయం తెలిసిందే. ఇక సారథిగా కేకేఆర్‌ జట్టుకు రెండు టైటిల్స్‌ అందించాడు.


All Rights Reserved By telugunewstimes
Print Save