
బెంగళూరు: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ అభిమానులు ఊగిపోయారు. కానీ ఆ ఉత్సాహం విషాదంలోకి మారింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
బుధవారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయంలో ఆర్సీబీ జట్టుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ స్వాగతం పలికారు. అనంతరం జట్టు విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియంకు వెళ్లే కార్యక్రమం ఉండగా, అభిమానుల రద్దీ కారణంగా ఓపెన్ టాప్ బస్సు ఊరేగింపును రద్దు చేశారు.
స్టేడియం వద్ద నిర్వహించాల్సిన ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా తొక్కిసలాట నేపథ్యంలో రద్దయింది. భద్రతా విభాగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. అధికార వర్గాలు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
గమనిక: వేడుకల్లో పాల్గొనేవారు భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com