Logo
Date of Publish : 24 December 2025, 6:26 am
Editor : CH. MUKUNDARAO

భగవద్గీత మతానికి పరిమితం కాదు: మద్రాస్ హైకోర్టు

చెన్నై: భగవద్గీత, వేదాంతం, యోగా వంటి అంశాలను ఒక నిర్దిష్ట మతానికి మాత్రమే కట్టిపడేయలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇవి భారతీయ నాగరికత, తత్వశాస్త్రం మరియు నైతిక విలువలతో ముడిపడ్డ విశ్వవ్యాప్త భావాలేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశాలను బోధిస్తున్న కారణంతోనే ఏ సంస్థనైనా మతపరమైన సంస్థగా ముద్ర వేయడం సరికాదని తేల్చి చెప్పింది.
కోయంబత్తూరుకు చెందిన అర్ష విద్యా పరంపర ట్రస్ట్ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద రిజిస్ట్రేషన్ కోసం 2021లో దరఖాస్తు చేసుకోగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాన్ని తిరస్కరించింది. ట్రస్ట్ కార్యకలాపాలు మతపరమైనవిగా కనిపిస్తున్నాయని, అలాగే ముందస్తు అనుమతి లేకుండా రూ.9 లక్షల విదేశీ విరాళాలు స్వీకరించిందని కారణాలు చూపింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్ కేంద్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరించారు. భగవద్గీత ఒక మత గ్రంథం మాత్రమే కాదని, అది నైతిక శాస్త్రం (మోరల్ సైన్స్)తో పాటు భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. యోగాను మతపరమైన కోణంలో చూడటం సరికాదని, అది ప్రపంచవ్యాప్తంగా ఆచరించబడుతున్న జీవన విధానమని వ్యాఖ్యానించారు. వేదాంతం మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన తత్వశాస్త్రమని తెలిపారు.
FCRA ప్రకారం ఒక సంస్థ మతపరమైనదా కాదా అని నిర్ణయించాలంటే స్పష్టమైన ఆధారాలు అవసరమని, కేవలం అనుమానాలపై దరఖాస్తును తిరస్కరించరాదని హైకోర్టు ఆదేశించింది. అలాగే 2021లో దాఖలైన దరఖాస్తుపై 2024 అక్టోబర్‌లో చర్యలు తీసుకోవడం సరికాదని, వేగవంతమైన మరియు పారదర్శక నిర్ణయాలు సుపరిపాలనలో భాగమని గుర్తు చేసింది.
రూ.9 లక్షల విదేశీ విరాళాల అంశంలో ట్రస్ట్ ఇప్పటికే జరిమానా చెల్లించి రాజీ పడినందున, అదే విషయాన్ని మళ్లీ కారణంగా చూపడం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను రద్దు చేస్తూ, ట్రస్ట్ దరఖాస్తును కొత్తగా పరిశీలించి మూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఆధ్యాత్మికతకు మతానికి మధ్య తేడా ఉందని, భారతీయ సంప్రదాయాలను కేవలం మతపరమైన కోణంలో మాత్రమే చూడటం సరికాదని ఈ తీర్పు స్పష్టం చేసింది. సంప్రదాయ విద్య, యోగా, వేదాంతాన్ని ప్రచారం చేస్తున్న అనేక సంస్థలకు ఈ తీర్పు ఊరటనిచ్చేదిగా నిలుస్తోంది.


All Rights Reserved By telugunewstimes
Print Save