చెన్నై: తమిళనాడులో భారత ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియ పూర్తికాగా, తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లకు చేరింది.
తాజా గణాంకాల ప్రకారం 2,77,38,925 మంది పురుషులు, 2,89,60,838 మంది మహిళలు, 7,617 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షలకు పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగించబడినట్లు అధికారులు తెలిపారు. గతంలో 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం తగ్గి 5.67 కోట్లకు చేరింది.
2025 నవంబర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం 2025 డిసెంబర్ 19న విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాలో సుమారు 5.43 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను 2026 జనవరి 30 వరకు స్వీకరించి పరిశీలించిన అనంతరం 27,53,796 మంది కొత్త ఓటర్లను తుది జాబితాలో చేర్చారు.
సవరణలో భాగంగా 97 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. వీరిలో సుమారు 26.94 లక్షల మంది మరణించినవారు కాగా, 66.44 లక్షల మంది ఇతర ప్రాంతాలకు మారినవారిగా గుర్తించారు. మరో 3.39 లక్షల మంది బహుళ ప్రాంతాల్లో నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
తుది జాబితా ప్రకారం చెంగల్పట్టు జిల్లాలోని షోలింగనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 5,36,991 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇక చెన్నైలోని హార్బర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,16,896 మంది ఓటర్లు ఉన్నారు.
రాబోయే 2026 వేసవి కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా ఓటర్ల జాబితా కీలకంగా మారింది.
తుది గణాంకాలు:
మొత్తం ఓటర్లు: 5.67 కోట్లు
పురుషులు: 2.77 కోట్లు
మహిళలు: 2.89 కోట్లు
థర్డ్ జెండర్ ఓటర్లు: 7,617 మంది
.............
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com