
విల్లివాకం న్యూస్: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది సంబరాలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి స్థానిక కొరట్టూరు అగ్రహారం, కోదండ రామాలయం కమ్యూనిటీ హాలు వేదికయింది. ఇందులో ముఖ్య అతిథిగా సీనియర్ అడ్వకేట్ ఆర్ఎస్ జీవరత్నం విచ్చేశారు. గౌరవ అతిథులుగా చార్టెడ్ ఇంజనీర్ భోజనాల నాగరాజ గుప్తా, జేఎన్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా హాజరయ్యారు. అలాగే సంస్థ అధ్యక్షులు జేయం నాయుడు, ప్రధాన కార్యదర్శి జే శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, అడ్వైజర్ ఎం ఎస్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్స్ విఎన్ హరినాథ్, పి సరస్వతి, కేఎన్ సురేష్ బాబు పాల్గొన్నారు.
ఇందులో ముఖ్య అతిథి మాట్లాడుతూ శ్రీ కళా స్రవంతి సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, ఈ సంస్థకు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో డాక్టర్ సి అమరావతి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఇందులో శ్రీ కన్యకా పరమేశ్వరి కళ మరియు విజ్ఞాన మహిళ కళాశాల విద్యార్థినులచే నృత్య ప్రదర్శనలు, శ్రీ వేంకటేశ్వర ప్రాథమిక పాఠశాల నుంగంబాకం విద్యార్థులు, వేమన ఆడియో ఫేమ్ ఎస్ మహేశ్వరరావు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చివరిగా జీవి రమణ వందన సమర్పణ చేశారు.
…………