Logo
Date of Publish : 13 July 2025, 10:02 am
Editor : CH. MUKUNDARAO

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

చెన్నై: తెలుగు చిత్రసీమకు తీరని లోటు కలిగిస్తూ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆయన, ఉదయం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

తెలుగు చిత్రసీమలో విలక్షణ నటనకు మరో పేరు అయిన కోట శ్రీనివాసరావు, తన మృతితో అభిమానులను తీవ్ర శోకంలో ముంచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట, బ్యాంకు ఉద్యోగంతో పాటు నాటకాల ద్వారా నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టి, దశాబ్దాల పాటు విలన్‌, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా, సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

‘ప్రతిఘటన’, ‘శివ’, ‘శత్రువు’, ‘గణేష్’, ‘వందేమాతరం’ వంటి చిత్రాల్లో ఆయన ప్రతినాయక నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అలాగే ‘ఆహా నా పెళ్లంట’, ‘జంబలకిడిపంబ’, ‘బొమ్మరిల్లు’, ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’, ‘అతడు’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఒదిగిపోయారు.

తెలుగు భాషలోని వివిధ యాసలను తన పాత్రల ద్వారా సహజంగా పలికించి, నేటితరం నటులకు మార్గదర్శిగా నిలిచారు. వివిధ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు.

కోట శ్రీనివాసరావుకు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన నంది అవార్డులను తొమ్మిది సార్లు, SIIMA అవార్డును ఒకసారి అందుకున్నారు. ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటు.


All Rights Reserved By telugunewstimes
Print Save