
చెన్నై:అంటరానితనం అనే అంధకారాన్ని ఛేదించి, సమానత్వం అనే వెలుగును దేశానికి చిగురింపజేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినా, అసామాన్య నాయకుడిగా ఎదిగిన ఆయన జీవితమే ఒక ఉద్యమం. ఆయన చేసిన ప్రతి అడుగు, పలికిన ప్రతి మాట, సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయి.
మూలాల నుంచి పైకీ...
1908 ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలో జన్మించిన జగ్జీవన్రామ్, చిన్ననాటి నుంచే కుల వివక్షను ఎదుర్కొన్నారు. కానీ, ఆ అవమానాలను ఆయన పోరాటంగా మార్చుకున్నారు. చదువు కోసం పోరాడిన బాలుడు, సమాజంలో సమానత్వం కోసం యుద్ధం చేసిన యువకుడిగా ఎదిగాడు.
సామాజిక ఉద్యమానికి నడికట్టిన నాయకుడు
1934లో "ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్" స్థాపనతో, దళితుల కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించడం, రాజకీయ అంగీకారాన్ని సాధించడం ఆయన త్యాగాలకు నిదర్శనం.
రాజకీయ రంగంలో వెలుగుతెచ్చిన నేత
జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో అత్యంత యువ మంత్రిగా అవకాశం పొందిన జగ్జీవన్రామ్, కార్మిక, రైల్వే, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు భుజాన వేసుకుని, దేశాభివృద్ధికి మించిన సేవలందించారు. హరిత విప్లవం విజయవంతం కావడంలో ఆయన కృషి అత్యంత కీలకం.
అజాతశత్రువు – అందరికి ఆదర్శం
గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకున్న జగ్జీవన్రామ్, సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు దేశ స్వాతంత్య్ర పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలనలో గాంధీకి మద్దతుగా నిలిచి, ప్రజల చైతన్యానికి కారకుడయ్యారు.
జీవితం ఒక సందేశం
1986లో కన్నుమూసిన ఈ మహనీయుడు, ఐదు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. ఆయన జీవితం, సేవలు, ఆదర్శాలు నేటి యువతకు దీపస్తంభంగా నిలవాలి. సమాజాన్ని మార్చాలంటే – జగ్జీవన్రామ్ బాటలో నడవాల్సిందే.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com