Logo
Date of Publish : 30 December 2025, 2:49 pm
Editor : CH. MUKUNDARAO

బడ్జెట్‌కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ కీలక సమావేశం

న్యూఢిల్లీ:కేంద్ర బడ్జెట్ 2026–27 ప్రవేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో విస్తృత స్థాయి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో నెలకొన్న అనిశ్చితులు, అలాగే భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈ బడ్జెట్‌పై కీలకంగా మారాయి. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వృద్ధి వేగాన్ని కొనసాగించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఉపాధి సృష్టి, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలపై ఆర్థికవేత్తలు తమ సూచనలు, అభిప్రాయాలను ప్రధానికి వివరించారు.
బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని, అలాగే ప్రపంచ ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర, సమతుల్య బడ్జెట్‌ను రూపొందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బడ్జెట్‌కు ముందు జరుగుతున్న ఈ సంప్రదింపులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు దిశానిర్దేశం చేయనున్నాయి


All Rights Reserved By telugunewstimes
Print Save