ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఈ ఆగ్రహం వ్యక్తమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశానికి జనసేన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా-నగర అధ్యక్షులు, వీర మహిళ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, సెల్ ఛైర్మన్లు హాజరయ్యారు.
🔸 తిరుమల లడ్డూ వివాదంపై అసంతృప్తి
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినా, జనసేన నేతలు స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో పార్టీ విఫలమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ కేసుకు సంబంధించి సీబీఐ సిట్ ఇటీవల నెల్లూరు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తోంది. ఈ ఆరోపణలకు తగిన కౌంటర్ ఇవ్వడంలో జనసేన నేతలు విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ మండిపడినట్లు సమాచారం.
🔸 ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం కూడా కీలకం
అలాగే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపైనా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. తన వద్ద అందరి వివరాల జాబితా ఉందంటూ వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అరవ శ్రీధర్కు సంబంధించిన వీడియోలు, చాటింగ్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆయనపై లైంగిక ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో జనసేన అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్కు వారం రోజుల గడువు విధించినట్లు సమాచారం.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com