
దొనబండ క్వారీలో ముగ్గురు సమాధి
డ్రిల్లింగ్లో జారిన కొండ చెరియలు
బండరాళ్ల కింద కార్మికులు చిద్రం
సహాయ చర్యల్లో అధికారులు బిజీబిజీ
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని దొనబండ కొండల్లోని క్వారీలో సోమవారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది. దొనబండ కొండపై క్వారీలో బండరాళ్ళకు డ్రిల్లింగ్ చేస్తుండగా పెద్ద మొత్తంలో బండరాళ్లు జారి పడటంతో, ముగ్గురు క్వారీ కార్మికులు అక్కడిక్క్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలు పెద్ద పెద్ద బండ రాళ్ల గుట్టల్లో చిద్రమయ్యాయి. ప్రోయిక్లైన్లు, పెద్దపెద్ద మిషన్లతో బండరాళ్లను తొలగించి మృతదేహాలను వెలికి తీసే పనిలో క్వారీ యాజమాన్యం, పోలీసులు నిమగ్నమయ్యారు. క్వారీలో కార్మికులు మృతి చెందడం వార్త ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. పొట్ట చేత పట్టుకొని వేరే రాష్ట్రాల నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన కార్మికుల బతుకులు కొండల్లోని బండ రాళ్ళ కింద ఛిద్రమయ్యాయి. అత్యంత విషాదకర ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
.. బండరాళ్ల కింద ముగ్గురు చిద్రం
కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో దొనబండ పవన్ క్రషర్ కి చెందిన క్వారీలో బ్లాస్టింగ్ పూర్తయింది. బ్లాస్టింగ్ అనంతరం ఏర్పడిన పెద్దపెద్ద బండల స్లాబులను చిన్నవిగా చేసి బ్లాస్ట్ చేసేందుకు సోమవారం ఉదయాన్నే క్వారీకి చేరుకున్న నలుగురు కార్మికులు హోల్స్ పెడుతున్నారు. జి.కొండూరు మండలం చెరువు మాధవరానికి చెందిన డ్రిల్లింగ్ యజమాని బత్తుల దుర్గా రాజ్ (23), జి కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో నివసిప్తున్న ఒడిషా డ్రిల్లర్ బిబి నాయక్ (42), చెవుటూరు లోనే నివసిస్తున్న చత్తీస్ఘడ్ కార్మికుడు రామ్ దేవ్ భాగేల్ (33)లు పెద్దపెద్ద బండరాళ్లకు హోల్స్ పెడుతున్నారు. బ్లాస్టింగ్ కు కదిలి లూజుగా మారిన పెద్ద పెద్ద బండ రాళ్లన్నీ ఒక్కసారిగా జారి కొండ నుంచి దిగువ భాగంలో పడిపోయాయి. ముగ్గురు కార్మికులూ కిందకు జారి పడిపోయారు. దీంతో దుర్గారాజ్, బీబీ నాయక్, రామ్ దేవ్ బాహేల్ పెద్ద పెద్ద బండరాళ్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పని చేస్తున్న మరో వ్యక్తి ఈ ప్రాంతానికి దూరంగా ఉండటంతో అతను క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. క్వారీ యజమానుల సహకారంతో బండరాళ్ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను పెద్దపెద్ద యంత్రాలతో వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు.
అయ్యో దొనబండ.. హతవిథీ
గత కొద్దిరోజులుగా నిరంతరంగా వర్షాలు పడుతుండటంతో పాటు ముందుగానే బ్లాస్టింగ్ జరగడం ద్వారా కదిలిపోయిన కొండరాళ్ల బ్లాక్స్ కు హోల్స్ వేస్తున్నందున, ఒక్కసారే బండరాళ్లన్నీ జారీ కింద పడటంతో ఈ
ప్రమాదం చోటుచేసుకుంది. పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలి నాలి చేసుకునే కార్మికులు క్వారీలలో దుర్మరణం చెందడంతో కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాగా క్వారీలలో బ్లాస్టింగ్ చేసే కార్మికులకు, బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసే కార్మికులకు సరైన ప్రమాద రక్షణ సౌకర్యాలు ఏర్పర్చక పోవడం వల్లే నిత్యం క్వారీలలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మైనింగ్ తో పాటు వివిధ శాఖల అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించి క్రషర్, క్వారీలలో పనిచేసే కార్మికుల జీవితాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com