Logo
Date of Publish : 28 April 2026, 12:05 pm
Editor : CH. MUKUNDARAO

దేశవ్యాప్తంగా ఇంధన కొరతపై NHRC కేసు నమోదు – తక్షణ చర్యలకు డిమాండ్

చెన్నై, న్యూస్:దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, LPG సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, ఈ సమస్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దృష్టికి అధికారిక ఫిర్యాదు చేరింది. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సమర్పించిన ఈ ఫిర్యాదును NHRC డైరీ నెం. 9329/IN/2026గా నమోదు చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద “No Stock” బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరత, LPG సరఫరాలో అంతరాయం, పొడవైన క్యూలు, రవాణా వ్యవస్థలో ఆటంకాలు ప్రజల రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అత్యవసర సేవలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఫిర్యాదులో ప్రస్తావించారు.
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్, LPG వంటి ఇంధన వనరులు విలాస వస్తువులు కాదని, ఇవి ప్రజల జీవనోపాధి, వైద్య సేవలు, వ్యవసాయం, ఆహార సరఫరా వ్యవస్థలకు కీలకమని పేర్కొన్నారు. అంబులెన్స్ సేవలు, ప్రజా రవాణా, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు అన్నీ ఈ ఇంధనంపై ఆధారపడుతున్నాయని ఆయన వివరించారు.
ఈ సమస్య రాజ్యాంగ పరమైన హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా జీవన హక్కు (ఆర్టికల్ 21), సమాన హక్కులు (ఆర్టికల్ 14), వినియోగదారుల హక్కులు ప్రభావితమవుతున్నాయని తెలిపారు.
ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మరియు సంబంధిత రాష్ట్ర అధికారులకు వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు.

తక్షణ చర్యల కోసం ప్రధాన డిమాండ్లు:
ఇంధన నిల్వలపై జిల్లా వారీ పారదర్శక సమాచారం విడుదల
పెట్రోల్ బంకులు, డిపోలు, LPG గోదాములపై ఆకస్మిక తనిఖీలు
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు
రియల్ టైమ్ స్టాక్ వివరాల కోసం పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు
టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థ ప్రారంభం
రాష్ట్రాలతో సమన్వయం ద్వారా నిరంతర సరఫరా
ఇక, ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ఆయిల్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆయన కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకుంటే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాన్ని అత్యవసర ప్రజా సమస్యగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 


All Rights Reserved By telugunewstimes
Print Save