Logo
Date of Publish : 27 August 2024, 12:45 pm
Editor : CH. MUKUNDARAO

అమరజీవికి మండలి బుద్ధప్రసాద్ ఘన నివాళులు

విల్లివాకం న్యూస్: చెన్నై మైలాపూర్ లోని పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రవతరణానికి, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఆధ్యుడు అమరజీవి పొట్టి శ్రీరాములని తెలిపారు. 1913లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో తెలుగు రాష్ట్ర విభజనకు ప్రతి పాదన జరిగిందని, కానీ 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదన్నారు. 1956లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష, బలిదానం తర్వాత తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. స్వాతంత్రోద్యమం, ఉప్పు సత్యాగ్రహానికి అనుకూలంగా, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పాటుపడిన వారిలో ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్ ముఖ్ తదితర ప్రముఖులు ఉన్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత మద్రాసు రాష్ట్ర రాజధానికి తెలుగువారు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు ముఖ్య కారకులన్నారు. ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలుగు భాష కాపాడుకోలేని, అభ్యసించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముందుగా ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ను కే అనిల్ కుమార్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఇందులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక కమిటీ అధ్యక్షులు కె.అనిల్ కుమార్ రెడ్డి, సభ్యులు ఎంవి నారాయణ గుప్తా, గుడిమెట్ల చెన్నయ్య, జెఎం నాయుడు, సినీ గేయ రచయిత భువనచంద్ర పాల్గొన్నారు.
......................


All Rights Reserved By telugunewstimes
Print Save