Logo
Date of Publish : 31 July 2024, 11:49 pm
Editor : CH. MUKUNDARAO

గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం

ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే.. ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం సిఎం రేవంత్‌ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం మంత్రులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. తరవాత గవర్నర్‌తో సిఎం, మంత్రులు గ్రూప్‌ ఫోటో దిగారు. ఆ తదుపరి హై టీలో విఐపిలు పాల్గొన్నారు. 1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్‌ వర్మ.. త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్టాన్రికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్‌గా రావడం విశేషం.


All Rights Reserved By telugunewstimes
Print Save