Logo
Date of Publish : 24 June 2025, 3:35 pm
Editor : CH. MUKUNDARAO

తమిళనాడులో ఆర్థిక సంక్షోభమా? చెన్నై హైకోర్టు ప్రశ్న

టి నగర్ న్యూస్: తమిళనాడులో ప్రజా పంపిణీ పథకం కింద రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయాల్సిన వంట నూనె కొనుగోలుకు టెండర్ ఆహ్వానించబడింది. ఇందులో పాల్గొన్న KTV హెల్త్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వంట నూనెను సరఫరా చేసింది. టెండర్ షరతుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 141.22 కోట్లను 30 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంది.

ఇంతవరకు ప్రభుత్వం చెల్లించకపోవడంతో, ఈ బకాయిని చెల్లించేలా కోర్టు ఆదేశించాలని కోరుతూ కంపెనీ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ముందు విచారణకు వచ్చింది.

విచారణలో, ఇప్పటికే రూ. 200 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉందని, అయినా కొత్త టెండర్ ప్రక్రియలో ప్రభుత్వం నిమగ్నమైందని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, “గత రెండు వారాలుగా పదవీ విరమణ ప్రయోజనాలు కూడా చెల్లించట్లేదని కోర్టులకు పిటిషన్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిర్వహణకు తగిన తీరా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

"చెల్లించాల్సిన మొత్తాలను ఎరిగి కూడా చెల్లించకపోవడంలో ఏదైనా ఉద్దేశముందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగానా?" అని వ్యాఖ్యానించి, "ఇది సరైన పాలన కాకపోవచ్చు" అని హితవు చెప్పారు.

అంతటితో పాటు, ఈ బకాయిని చెల్లించాలనే అంశంపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకురావాలని ఆదేశించి, తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save