Logo
Date of Publish : 03 November 2025, 12:54 am
Editor : CH. MUKUNDARAO

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజేత!

చెన్నై న్యూస్: భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది! వన్డే క్రికెట్‌లో తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుని, దేశాన్ని గర్వపడేలా చేసింది.

ముంబైలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. జవాబులో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆమె తన స్పిన్ మాయతో 5 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ 2 వికెట్లు తీసి బౌలింగ్‌లో మెరిపించగా, శ్రీ చరణి ఒక వికెట్ సాధించింది.

బ్యాటింగ్‌లో కూడా షెఫాలీ వర్మ సత్తా చాటింది. కేవలం 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 58 బంతుల్లో 58 పరుగులు చేసి అద్భుత హాఫ్ సెంచరీ సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన 45 పరుగులతో సహకరించింది.

47 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో ఇదే భారత జట్టు తొలి వరల్డ్ కప్ విజయం. 2005, 2017 ఫైనల్స్‌లో ఓటమి చవిచూసిన భారత్‌, ఈసారి ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరి విజేతగా నిలిచి తన కలను నిజం చేసుకుంది.

 

టీమిండియా మహిళల ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాలు రేపుతోంది. క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.
...............


All Rights Reserved By telugunewstimes
Print Save