Logo
Date of Publish : 04 August 2025, 4:52 pm
Editor : CH. MUKUNDARAO

ఉత్కంఠ భరిత పోరులో భారత్ విజయం – సిరాజ్ ఆఖరి వేళ మెరుపులు

చెన్నై న్యూస్: ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా అద్భుతంగా ముగించింది. ఊహించని ట్విస్ట్‌లతో నిండి, చివరి శ్వాస వరకు ఉత్కంఠగా సాగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఓవర్‌నైట్ స్కోర్ 339/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. టీమిండియా బౌలర్ల ధాటికి చివరికి 367 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రధానంగా మహ్మద్ సిరాజ్ (5 వికెట్లు – 104 పరుగులు) విజృంభణతో భారత విజయం సులభమైంది.

ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జెమీ ఓవర్టన్ బౌండరీలతో రాణించాడు. అయితే సిరాజ్ వరుసగా జెమీ స్మిత్(2), ఓవర్టన్(9)లను ఔట్ చేసి భారత్‌కు ఊపునిచ్చాడు. తర్వాత ప్రసిధ్ కృష్ణ వేసిన స్టన్నింగ్ యార్కర్‌తో జోష్ టంగ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.

మ్యాచ్ ఉత్కంఠత అత్యంత స్థాయికి చేరగా, గాయంతో ఉన్న క్రిస్ వోక్స్ చివరి ప్రయత్నంగా బ్యాటింగ్‌కు దిగాడు. అట్కిన్సన్‌తో కలిసి స్కోరు ముందుకు తీసుకెళ్లాడు. అయితే అట్కిన్సన్ భారీ షాట్ కొట్టగా ఆకాష్ దీప్ క్యాచ్ మిస్ చేయడం సిక్సర్‌గా మారింది. మళ్లీ అట్కిన్సన్ స్ట్రైక్‌లోకి రాగా, ప్రసిధ్ బౌలింగ్‌లో మరికొన్ని పరుగులు వచ్చాయి.

అయితే, సిరాజ్ మళ్లీ దూకుడు చూపించి అట్కిన్సన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో మ్యాచ్‌కు ముగింపు పలికింది.

ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ 2–2తో సమమయ్యింది. ఈ సిరీస్ మొత్తంగా టెస్ట్ చరిత్రలోనే అత్యంత రసవత్తరమైన సిరీస్‌గా నిలిచింది.
ఇది నిజమైన టెస్ట్ క్రికెట్‌కు నిదర్శనం.


All Rights Reserved By telugunewstimes
Print Save