Logo
Date of Publish : 28 June 2024, 11:38 am
Editor : CH. MUKUNDARAO

స్మార్ట్‌ సిటీలో.. ప్రయివేటు విద్యా ఖర్చు ఇంతింత కాదయా !!

కాకినాడ,  జూన్‌ 28 : స్మార్ట్‌ సిటీలోని ప్రయివేటు పాఠశాలల్లో ప్రాథమిక మాధ్యమిక విద్య చదవాలంటే బ్యాంకు రుణాలు చేయాల్సిన అగత్యంగా మారిందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. మల్టీ ప్లెక్స్‌ సినిమా హాల్స్‌ తరహాలో బయట వస్తువులు తీసుకురాదన్నట్టుగా విద్యా సంస్థలు విద్యతో బాటుగా బట్టల దుకాణం షూ మార్ట్‌ బుక్‌ డిపో బ్యాగ్స్‌ వ్యాపారాలు కూడా చేస్తున్నాయన్నారు. 20వేల నుండి 60వేల వరకు ఫీజులు పుస్తకాల కు 6నుండి 12వేలు సాక్స్‌ బెల్ట్‌ బూట్లు మున్నగు వాటికి వెయ్యి నుండి 2వేలు 2జతల యూనిఫారం క్లాత్‌కు 4నుండి 8వేలు, శనివారం స్పెషల్‌ డ్రెస్‌ క్లాత్‌కు వెయ్యి నుండి మూడు వేలు, గుర్తింపు కార్డుకు మున్నగు ఇతర ఖర్చులు రీత్యా వెయ్యి రూపాయలు వెరసి 25వేల నుండి లక్ష రూపాయల వరకు వెచ్చించడం చేయలేకుంటే ప్రయివేటు పాఠశాలల్లో విద్య నేర్వలేని దుస్థితి వుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పెంచకపోవడం వున్న వాటిని అభివృద్ధి చేయకపోవడం వలన తల్లిదండ్రులు తమ పిల్లలను వాటి వైపుకు తీసుకు వెళ్ళే సాహసం చేయలేక పోతున్నారన్నారు. విద్యా ఫీజులకు తప్ప ఇతరవాటికి ప్రయివేటు డాక్టర్‌ వైద్యానికి లెక్కా పత్రం లేనట్టుగా రసీదులుండవన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా యంత్రాంగం వైఖరిలో మార్పు లేకపోవడం వలన ఇష్టారాజ్య విద్యా వ్యాపారం వటవృక్షంగా తయారయ్యిందన్నారు. స్మార్ట్‌ సిటీలోని 33 విద్యా సంస్థల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా వుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను నాలుగు రెట్లు సంఖ్య పెంచి అభివృద్ధి చేస్తే తప్ప ప్రయివేటు విద్యా వ్యాపారాల ఆగడాలు తగ్గవని పౌర సంఘం కన్వీనర్‌ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save