నిజామాబాద్లో అమాయకులను టార్గెట్ చేస్తూ హనీ ట్రాప్ పేరుతో దందా నిర్వహిస్తున్న ఓ దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాత్రి వేళల్లో రోడ్డుపై ఒంటరిగా నిలబడే మహిళ.. వెళ్లే వ్యక్తులతో పరిచయం పెంచుకుని డబ్బుల గురించి మాట్లాడేదని సమాచారం. తర్వాత వారిని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి ఉచ్చులో పడేసే ప్లాన్ అమలు చేసేదని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితుడు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే మహిళ భర్త అక్కడికి చేరుకుని గొడవ సృష్టించేవాడట. “నా భార్యతో ఎందుకు వచ్చావు?” అంటూ బెదిరింపులకు దిగుతూ, పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేవాడని తెలుస్తోంది. ఇదే సమయంలో మహిళ కూడా బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అరుపులు పెట్టేదని విచారణలో బయటపడింది.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన వ్యక్తులను “పోలీస్ కేసు పెడతాం”, “రేప్ కేసులో ఇరుక్కుపోతావ్” అంటూ బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరువు పోతుందనే భయంతో పలువురు బాధితులు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.
గత రెండు వారాలుగా నిజామాబాద్లో ఈ హనీ ట్రాప్ ముఠా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దంపతుల కదలికలను గమనించిన పోలీసులు చివరకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
దర్యాప్తులో భాగంగా వారి వద్ద నుంచి ఓ కత్తి కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎవరైనా ఎదురు తిరిగితే బెదిరించేందుకు దాన్ని ఉపయోగించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రజలు అపరిచితుల మాటలకు మోసపోవద్దని, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
............