చెన్నై న్యూస్:చెన్నై మహానగరంలోని తిరువల్లికేణి రామ్ నగర్లో వెలసిన శ్రీ రామదాస ఆంజనేయ స్వామి ఆలయంలో 47వ సంవత్సర ఆంజనేయ స్వామి మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా 14వ తేదీ బుధవారం ఉదయం ఆంజనేయ స్వామిని చందనంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల సహితంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, పురోహితుల చేత అన్నప్రసాదాలతో అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6 గంటలకు ఆంజనేయ స్వామిని వెన్నతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. రాత్రి 7 గంటలకు సెల్వి స్వాతి స్వరాలయం బృందం భక్తి గీతాల ఆలాపన చేయగా, భక్తులంతా భక్తిభావంతో పరవశించారు.
ఈ సందర్భంగా శ్రీ రామదాస ఆంజనేయ స్వామి ఉత్సవ కమిటీ గాయనీ-గాయకులను సత్కరించింది. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రామ్ నగర్ సంక్షేమ సంఘ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com