
విళ్లివాకం న్యూస్: చెన్నై, మైలాపూర్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా అరుణా శ్రీనాథ్ ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని కొనియాడారు. తన నిర్వహణలో స్మారక భవనం కార్యక్రమాలు చేపట్టడం ధన్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ముందుగా కార్యదర్శి వి కృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా డిఆర్ బిసిసి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ట్రస్టీ ముక్కాల వెంకట కన్నయ్య చెట్టి విచ్చేశారు. విశిష్ట అతిథిగా పారిశ్రామికవేత్త వైవి హరికృష్ణ పాల్గొని శ్రీ పొట్టి శ్రీరాములు కీ చైన్ ఆవిష్కరించారు.
ప్రత్యేక అతిధిగా సిజిఎస్ టి అదనపు కమిషనర్ బి లోకనాథరెడ్డి ఐఆర్ఎస్ పాల్గొన్నారు. అలాగే మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ జొన్నలగడ్డ వెంకటరమణ పాల్గొన్నారు. అతిథులంతా తెలుగు ప్రజలకు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని, విశిష్ట సేవలను కొనియాడారు. సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వందన సమర్పణ కమిటీ సభ్యులు డాక్టర్ ఎం.వి నారాయణ గుప్తా చేశారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరానికి చెందిన విభూతి లోపరాజు బృందం ‘అమరజీవి’ బుర్రకథ ఎంతగానో అలరించింది. ఇందులో సభ్యులు డాక్టర్ విస్తాలి శంకరరావు, గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ ఏవి శివకుమారి, జేయం నాయుడు, తెలుగు ప్రముఖులు ఆనంద్ కుమార్ రెడ్డి, కృష్ణారావు, తమ్మినేని బాబు, వై ఎరుకలయ్య ,టామ్స్ ఇశ్రాయేలు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

……………