చెన్నై న్యూస్: తమిళుల సంప్రదాయ వీర క్రీడ జల్లికట్టు పొంగల్ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతోంది. మధురై జిల్లా అవనియాపురంలో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు, పాలమేడుతో కొనసాగి, ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత అలంగనల్లూరులో అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.
ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నై నుంచి మధురైకి చేరుకున్నారు. ఆయనకు మంత్రి మూర్తి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అలంగనల్లూరు వడివాసల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి సీఎం జల్లికట్టు పోటీలను ఆసక్తిగా తిలకించారు.
పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మరియు ఎద్దుల యజమానులకు సీఎం స్టాలిన్ బంగారు ఉంగరాలను బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జల్లికట్టు తమిళుల శౌర్యానికి ప్రతీక అని, అలంగనల్లూరు ఈ వీర క్రీడకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. మధురై భూమి శౌర్యం, సంస్కృతి, జ్ఞానానికి నిలయమని చెప్పారు.
తమ ప్రభుత్వం తమిళ సంప్రదాయాలను కాపాడేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం, కలైంగర్ శతాబ్ది గ్రంథాలయం, జల్లికట్టు కోసం నిర్మించిన ప్రత్యేక స్టేడియం ఇందుకు నిదర్శనమని తెలిపారు.
అలంగనల్లూరులో కొనసాగుతున్న జల్లికట్టు పోటీల వేదిక నుంచే ముఖ్యమంత్రి రెండు కీలక ప్రకటనలు చేశారు. వాటిలో ముఖ్యంగా, సాంప్రదాయ జల్లికట్టు పోటీల్లో పాల్గొని అత్యధిక ఎద్దులను మచ్చిక చేసుకుని ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించడం విశేషంగా నిలిచింది. దీంతో జల్లికట్టు క్రీడాకారుల్లో ఆనందం వెల్లివిరిసింది.
.........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com