పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అసాధారణమైన ఘటన చోటు చేసుకుంది. నెలకు కేవలం రూ.2500 సంపాదించే సాధారణ పనిమనిషి కలితా మాఝీ ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎస్సీ రిజర్వ్డ్ ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కలితా మాఝీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 12 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు రావడం విశేషం.
గత ఇరవై ఏళ్లుగా నాలుగు ఇళ్లలో పాత్రలు కడగడం, వంట పనులు చేస్తూ జీవనం సాగించిన కలితా మాఝీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తరువాత కూడా తన పనిని ఆపలేదు. అదే సమయంలో ప్రజల మధ్యకి వెళ్లి ప్రచారం చేస్తూ, వారి సమస్యలను తెలుసుకోవడం ఆమెకు మంచి ఆదరణను తీసుకొచ్చింది.
సాధారణ జీవితం గడిపే మహిళగా ప్రజలతో మమేకం కావడం ఆమె విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాఝీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి 206 స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 81 స్థానాలకు పరిమితమైంది. ఇతర పార్టీలు కలిపి 6 స్థానాలు దక్కించుకున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దారి సుగమమైంది