
చెన్నై న్యూస్: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు అంకితభావంతో కృషి చేయాలని ఇందిరా విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఇందిరా రాజేంద్రన్ పిలుపునిచ్చారు.తెలుగు మహాజన సమాజం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వేణుగోపాల విద్యాలయం 46వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం చెన్నై తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షుడు కె. అనిల్కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందిరా రాజేంద్రన్తో పాటు ట్రస్ట్ యూనివర్సిటీ అధ్యక్షురాలు ప్రియదర్శిని రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రజా పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బహుమతులు, ట్రోఫీలతో సత్కరించారు. అలాగే పాఠశాల అధ్యక్షుడు కె. అనిల్కుమార్ రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు జ్ఞాపికలను అందజేసి ప్రత్యేకంగా సత్కరించారు. తెలుగు మహాజన సమాజానికి 25 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించిన ఎం.వి.ఎన్.ఆర్. శర్మను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షుడు కె. ఆనంద్ కుమార్ రెడ్డి, కోశాధికారి కె. రంగారెడ్డి, ఉప ప్రధానోపాధ్యాయుడు ఇళంగో, ప్రధానోపాధ్యాయురాలు వి. శీలా, కమిటీ సభ్యుడు వెంకటరెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
