చెన్నై న్యూస్:మాస్ సంఘం మాజీ అధ్యక్షుడు దివంగత శ్రీ జి. భుజంగరావు ఐఏఎస్ గారి కుమార్తె, చెన్నైలో సేవలందిస్తున్న సీనియర్ శిశు వైద్యురాలు డాక్టర్ ఐశ్వర్య రాజ్యలక్ష్మీరావు గారు ఇటీవల ప్రముఖ టెలివిజన్ సంస్థ పుదియ తలైమురై టీవీ ఛానల్ అందించే ప్రతిష్ఠాత్మక “శక్తి అవార్డు”ను అందుకున్నారు. ఆమె సమాజానికి చేసిన అంకితభావ సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
డాక్టర్ ఐశ్వర్య రాజ్యలక్ష్మీరావు గారు ఎంబీబీఎస్, డీసీహెచ్ పట్టాలను సంపాదించి సీనియర్ పీడియాట్రిషియన్గా సేవలందిస్తున్నారు. ఆమె వైద్య రంగంలోనే కాకుండా వికలాంగుల హక్కుల కోసం కృషి చేస్తున్న సామాజిక సేవకురాలిగా కూడా గుర్తింపు పొందారు.
2016 సంవత్సరంలో వికలాంగుల సంక్షేమం కోసం ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. చెన్నైలో “బెటర్ వరల్డ్ షెల్టర్” అనే సంస్థ ద్వారా వికలాంగులైన గృహరహిత మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ వారి జీవనోపాధి, సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు.
దివంగత శ్రీ జి. భుజంగరావు ఐఏఎస్ గారు స్థాపించిన DOCRAS అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తమిళనాడు ప్రభుత్వ వికలాంగుల సంక్షేమ శాఖ మరియు ప్రపంచ బ్యాంకు నిధుల సహకారంతో 2024 సంవత్సరం నుంచి ధర్మపురి జిల్లాలో కమ్యూనిటీ సేవలను ప్రారంభించారు. ప్రథమ దశలో ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండవ దశలో 2025 ఏప్రిల్ నుంచి కాంచీపురం, రాణిపేట జిల్లాలకు విస్తరించబడింది.
అదే సంస్థ ద్వారా పారా క్రీడాకారులకు శిక్షణ, సహాయం అందిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. అదనంగా భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిధులతో హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాజెక్టులో కూడా ఆమె సేవలందించారు.
ఆమె చేసిన సేవలను గుర్తించి 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పుదియ తలైమురై టీవీ ఛానల్ అందించే “శక్తి అవార్డు”కు ఎంపికైన ఆరుగురిలో ఒకరిగా ఆమె నిలిచారు.
డాక్టర్ ఐశ్వర్య రాజ్యలక్ష్మీరావు గారి విజయంపై గర్వపడుతున్నామని తెలియజేస్తూ, 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాస్ సంఘం తరపున చెన్నై అన్నా నగర్లోని ఆమె నివాసంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు డాక్టర్ కొల్లి రాజు, ఉపాధ్యక్షుడు శ్రీ పి. పాల్ కొండయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీ నూనె శ్రీనివాసులు, సంయుక్త కోశాధికారి శ్రీ వి. దీనదయాళన్ పాల్గొని ఆమె సేవలను ప్రశంసించారు.
.......
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com