చెన్నై న్యూస్ :ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ లభించలేదు. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్వతంత్రంగా పోటీ చేసి 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. డీఎంకే 59 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 47 స్థానాల్లో విజయం సాధించాయి. పొత్తులతో కలిపి చూస్తే, డీఎంకే కూటమి 73 స్థానాలు, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే హక్కు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో టీవీకేకు ప్రస్తుతం 113 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. ఇంకా ఇతర కూటమి భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇస్తే, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే, ఊహించని విధంగా డీఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ రెండు పార్టీల ప్రధాన లక్ష్యం విజయ్ నేతృత్వంలోని టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమేనని ప్రచారం జరుగుతోంది.
డీఎంకే సాధించిన 59 స్థానాలు, ఏఐఏడీఎంకే గెలుచుకున్న 47 స్థానాలు కలిపితే మొత్తం 106 స్థానాలు అవుతాయి. అదనంగా డీఎంకే కూటమిలోని విసికె (VCK), సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్ పార్టీలకు తలో 2 స్థానాలు ఉండగా, డీఎండీకే ఒక స్థానం గెలుచుకుంది.
ఇక ఏఐఏడీఎంకే కూటమి విషయానికి వస్తే, ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు డీఎంకే బయటి మద్దతు ఇవ్వవచ్చని సమాచారం. దీనితో పాటు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ పరిణామాలపై ఇప్పటివరకు డీఎంకే లేదా ఏఐఏడీఎంకే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ రాజకీయ పరిణామాలు నిజమైతే, తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా నిలవనుంది.
...........